అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) మోటార్లు నాశనం చేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం మోటార్లను రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారన్నారు. అంత పెద్ద మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తే బేరింగ్లు పాడవుతాయని చెప్పారు. అవి పాడైతే ఆ నెపం తమపై వేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు.
కాళేశ్వరంలో ఉన్నవి భారీ మోటార్లని హరీశ్ రావు తెలిపారు. ఒక జిల్లాకు అవసరం అయ్యే కరెంట్ ఒక్క మోటార్ రన్ చేయడానికి అవసరం అన్నారు. అలాంటి మోటార్లను ఆన్ చేసి ఆఫ్ చేస్తే దెబ్బతింటాయన్నారు. అలా చేయకూడదని ఇంజినీరింగ్ అధికారులు, బీహెచ్ఈఎల్ చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. రోజు ఉదయం 7 గంటలకు మోటార్లు స్టార్ట్ చేసి, సాయంత్రం 5 గంటలకు బంద్ చేస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం కరెంట్ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇలా చేస్తున్నారని చెప్పారు. అయితే ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్లు పనికి రాకుండా పోతాయన్నారు. ఈ మేరకు మోటార్లు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ (BHEL) కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిందన్నారు.
Harish Rao | ప్రాజెక్ట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని హరీష్ రావు అన్నారు. రిజర్వాయర్లపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి లేఖ రాసినట్లు చెప్పారు. సాగునీటిని సముద్రం పాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ (BRS)పై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లను ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని కోరారు.
కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి విలువ తెలియదన్నారు. ఎస్సారెస్పీ(SRSP)కి భారీగా ఇన్ఫ్లో వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీరు ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. వరద కాలువ ద్వారా మిడ్మానేరును నింపాలని డిమాండ్ చేశారు.