అక్షరటుడే, మెదక్ : Medak | పలువురు యువకులు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నారు. దీనికోసం నేరాలు చేయడానికి వెనకాడటం లేదు. బెట్టింగ్లు, చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా యూట్యూబ్ (Youtube) చూసి చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మెదక్ (Medak) జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన శ్రీకాంత్(24), లింగం(28), ప్రసాద్(20) స్నేహితులు. వీరు సులువుగా డబ్బు సంపాదించడానికి (Easy Money) బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలు చేయాలని ప్లాన్ వేశారు. ఈ మేరకు దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూశారు. అయితే పలు బ్యాంకుల్లో చోరీలకు యత్నించి విఫలం అయ్యారు. మెదక్ జిల్లా గుమ్మడిదలలో హెచ్డీఎఫ్సీ (HDFC) ఏటీఎంను ట్రాక్టర్కు కట్టి లాక్కెళ్లాని చూశారు. అయితే సైరన్ మోగడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయారు. వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్లో ఎస్బీఐ ఏటీఎంలో సైతం చోరీకి యత్నించారు. అక్కడ కూడా సైరన్ మోగడంతో పారిపోయారు.
Medak | మద్యం దుకాణాల్లో చోరీ
బ్యాంకుల్లో చోరీకి యత్నించి విఫలమైన వీరు వైన్ షాపుల్లో మాత్రం దొంగతనం చేశారు. గత నెలలో గుమ్మడిదలలోని భవాని వైన్షాపులో చోరీ చేశారు. ఈ నెల 7న కౌడిపల్లిలోని మద్యం దుకాణంలో చోరీ చేశారు. ఖరీదైన మద్యం బాటిళ్లు, నగదు ఎత్తుకెళ్లారు. అంతేగాకుండా ఆ పలు మద్యం బాటిళ్లను బయట విక్రయించారు. మరికొన్ని సీసాలను తాగడానికి దాచుకున్నారు.
Medak | సీసీ ఫుటేజీ ఆధారంగా..
బ్యాంకుల్లో దొంగతనానికి యత్నించిన వీరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ మేరకు మానేపల్లి శివారులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు (SP Srinivasa Rao) తెలిపారు. వారి నుంచి మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కావొద్దని ఆయన సూచించారు.