అక్షరటుడే, వెబ్డెస్క్ : Cloudburst | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని కిశ్తవార్లో ఇటీవలి చోటు చేసుకున్న క్లౌడ్ బరస్ట్ ఘటన మరువక ముందే మరోసారి మేఘ విస్ఫోటం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు దంచికొట్టడంతో వరద పోటెత్తింది. కొండ చరియలు విరిగి పడడంతో ఆరుగురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మేఘ విస్ఫోటనంతో రాజ్బాగ్లోని జోడ్ ఘాటి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం వాటిల్లింది. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టేందుకు గాను ఆ గ్రామానికి చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సంయుక్త బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు (Rescue Operation) చేపట్టింది. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.
Cloudburst | కొనసాగుతున్న సహాయక చర్యలు
జమ్మూ కాశ్మీర్లోని కథువా (Kathua) జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు కనొసాగుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ తెలిపారు. సైనిక, పారామిలిటరీ దళాలు రక్షణ, సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. జాంగ్లోట్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ గురించి సమాచారం అందుకున్న తర్వాత కథువా SSP శోభిత్ సక్సేనాతో మాట్లాడానని సింగ్ Xలో వెల్లడించారు. “నలుగురు చనిపోయారు. అలాగే, రైల్వే ట్రాక్, జాతీయ రహదారికి నష్టం జరిగింది. కథువా పోలీస్ స్టేషన్ కూడా ప్రభావితమైంది” అని ఆయన తెలిపారు.
Cloudburst | విరిగిపడిన కొండచరియలు..
కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలతో పాటు లఖన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్వాన్-హుట్లి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే అక్కడ పెద్దగా నష్టం జరగలేదు. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కథువా జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక చోట్ల నీరు నిలిచిపోవడం, కొండచరియలు విరిగిపడటం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. జమ్మూ-పఠాన్కోట్ జాతీయ రహదారి దెబ్బ తినడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.