అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి (Nizamsagar project) భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయంలో ఎగువన గల సింగూరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో వరద నీరు భారీగా వస్తోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 31,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులకు (17.80 టీఎంసీ) గాను శనివారం సాయంత్రానికి 1397.66 అడుగుల (9.02 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
సింగూరులోకి 43వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
నిజాంసాగర్ ఎగువ భాగంలోని మంజీర పరీవాహక ప్రాంతంలో గల సింగూర్ ప్రాజెక్టులోకి (Singur project) 43,634 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో సింగూరు ఐదు వరద గేట్లను ఎత్తి 31,412 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 523.60 మీటర్లకు (29.917 టీఎంసీలు) గాను శనివారం సాయంత్రానికి 521.90 మీటర్ల (21.338 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.