అక్షరటుడే, వెబ్డెస్క్ : Manjeera River | మంజీర నది ఉధృతంగా పారుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు (Singuru)కు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మెదక్ (Medak) జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ఏడుపాయలలో గల వనదుర్గ ఆనకట్ట (Vanadurga Project)పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి, పాపన్నపేట, చిలిప్చెడ్ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో మంజీర నదిలోకి వదర పోటెత్తింది. ఏడుపాయలలో మంజీర ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు దుర్గామాత ఆలయాన్ని (Edupayala Temple) మూసి వేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు నీటిలోకి వెళ్లొద్దని సూచించారు.
Manjeera River | పెరుగుతున్న ఇన్ఫ్లో
సింగూర్, వనదుర్గా ప్రాజెక్ట్ల నుంచి వస్తున్న నీటితో నిజాంసాగర్ (Nizam Sagar) ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలోకి తొమ్మిది వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మరోవైపు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) నిండుకుండలా మారింది. మరి కొద్ది గంటల్లో డ్యాం అలుగు పారనుంది. దీంతో సాగర్కు ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
Manjeera River | జంట జలాశయాలకు వరద ఉధృతి
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని జంట జలాశయాలైన హిమాయత్సాగర్ (Himayat Sagar), ఉస్మాన్సాగర్ (గండిపేట) నిండుకుండలా మారాయి. ఇప్పటికే అధికారులు హిమాయత్సాగర్ ఆరు గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నది (Musi River) ఉధృతంగా పారుతోంది. బాపుఘాట్, జియాగూడ, పురానాపూల్, నయాపూల్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ దగ్గర మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నది పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Manjeera River | కాళేశ్వరం దగ్గర..
జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం (Kaleshwaram) దగ్గర గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 2.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 85 గేట్లు ఎత్తి అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. వనపర్తి జిల్లాలోని సరళసాగర్ (Sarala Sagar) జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో నాలుగు ఆటోమెటిక్ సైఫాన్స్ తెరుచుకున్నాయి. కాగా ప్రాజెక్ట్ నిండగానే గేట్లు ఎత్తకుండా సైఫాన్స్ తెరుచుకొని ఆటోమేటిక్గా నీరు దిగువకు వెళ్లడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.