అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy | రాష్ట్ర పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం గోల్కొండ కోట (Golconda Fort) వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో మహాత్మా గాంధీ (Mahatma Gandhi) చూపిన పోరాటం ప్రపంచానికి సరికొత్త దిశను చూపించిందని పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసిందన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి బీజం వేసిందని కొనియాడారు. నెహ్రూ ఆలోచనలు, విజ్ఞాన శాస్త్ర పురోగతి, ఐదేళ్ల ప్రణాళికలు, గ్రీన్ రివల్యూషన్, బ్యాంకింగ్ రంగ జాతీయకరణ వంటి చర్యలు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
CM Revanth Reddy | ప్రజాస్వామ్య పునరుద్ధరణ మరియు సంక్షేమ కార్యక్రమాలు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2023న డిసెంబర్ 7న అధికారం చేపట్టిన తర్వాత, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. రైతులు, మహిళలు, యువత భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల సాధికారత కోసం మహాలక్ష్మి పథకం (Mahalaxmi scheme) కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టామని చెప్పారు. అలాగే రూ. 500కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం (Indiramma Gruha Nirman Scheme), రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలుచేస్తున్నామన్నారు.
CM Revanth Reddy | ఆర్థిక సవాళ్లు ఉన్నా..
రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 75,577 కోట్లుగా ఉన్న రుణ భారం, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 8,21,652 కోట్లకు పెరిగిందని సీఎం వివరించారు. ఇందులో రూ. 6,71,757 కోట్లు అప్పులుగా, రూ. 40,154 కోట్లు ఉద్యోగులు మరియు ఇతర పథకాల బకాయిలుగా ఉన్నాయని వెల్లడించారు. అయినా రూ. 2,20,676 కోట్ల రుణ సేవను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, ప్రపంచ బ్యాంక్తో చర్చలు జరిపి, తక్కువ వడ్డీ రేటుతో ఆర్థిక సహాయం పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.
CM Revanth Reddy | సామాజిక న్యాయం కోసం కుల గణన
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయంపై ప్రత్యేక దృష్టి సారించిందని రేవంత్ రెడ్డి వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను (BC reservation) అమలు చేసేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుల గణన ద్వారా బీసీల జనాభా 56.33%గా ఉన్నట్లు నిర్ధారించామని, సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ప్రకారం ఎస్సీ ఉప-వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ – 2047
“తెలంగాణ రైజింగ్ – 2047” దృష్టితో 2035 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (trillion dollar economy) ఎదిగేలా కృషి చేస్తున్నామని సీఎం వివరించారు. ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నామన్నారు.
CM Revanth Reddy | సన్న బియ్యం పథకం..
సంక్షేమ పథకాల్లో భాగంగా.. రూ. 13,000 కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా పథకం (Rythu Bharosa Scheem) కింద ఎకరానికి రూ. 12,000 సాయం అందిస్తున్నామన్నారు. 78 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ వంటి ఇస్తున్నామని చెప్పారు.