అక్షరటుడే , ఇందల్వాయి : Collector Nizamabad | జిల్లాలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తాము పనిచేస్తే స్థలాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. కార్యస్థానాల్లో ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని తిర్మన్పల్లి, పాల్దా గ్రామాల్లో కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిర్మన్పల్లి రైతు వేదికను (Thirmanpalli Rythu Vedika) కలెక్టర్ సందర్శించగా, వ్యవసాయ విస్తీర్ణ అధికారి (ఏఈవో) అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రైతు వేదికకు తాళం వేసి ఉండడం, పలువురు రైతులు బయట నిరీక్షిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో ఏఈవో కూడా చేరుకోగా, రైతు వేదిక వద్ద రైతులకు అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ కలెక్టర్ నిలదీశారు. ప్రస్తుతం భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ కార్యస్థానాలలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Collector Nizamabad | మెరుగైన వైద్యసేవలందించాలి
అనంతరం తిర్మన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Primary Health Center) కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అక్కడి నుండి పాల్దా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను (Government Primary School) సందర్శించారు. వంటగదిలోకి వెళ్లి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, దాని నిర్వహణను చక్కబెట్టాలని ఏపీవోను ఆదేశించారు.
Collector Nizamabad | సోక్పిట్ల నిర్వహణను పర్యవేక్షించాలి
నీటి సంరక్షణ కోసం అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలలో నిర్మించిన సోక్ పిట్ ల నిర్వహణ సజావుగా జరిగేలా, వాటి వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు.
Collector Nizamabad | ఫేస్ రికగ్నేషన్ పక్కాగా జరగాలి..
స్థానిక ప్రభుత్వ పాఠశాలకు 30 మంది విద్యార్థులు హాజరవగా, ఫేస్ రికగ్నేషన్(Face Recognition) ద్వారా 25మంది మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో మిగతా ఐదుగురి ఫేస్ రికగ్నేషన్ ఎందుకు నమోదు కాలేదని హెచ్ఎం సుమన్రెడ్డిని కలెక్టర్ ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతో నమోదు చేయలేని హెచ్ఎం పేర్కొనగా టెక్నికల్ టీంద్వారా సమస్యను పరిష్కరించి మిగతా ఐదుగురి హాజరును సైతం ఆన్లైన్లో కలెక్టర్ నమోదు చేయించారు. జిల్లాలో ఎక్కడ కూడా ఫేస్ రికగ్నేషన్లో సమస్యలు తలెత్తితే తక్షణమే టెక్నికల్ టీం (Technical Team) ద్వారా సమస్యను పరిష్కరించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డీఈవో అశోక్ను ఫోన్లో ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, పనితీరును పరిశీలించారు.
Collector Nizamabad | ఎరువుల గిడ్డంగి తనిఖీ
అనంతరం సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో యూరియా, ఇతర ఎరువులను అందజేశామని సొసైటీ సీఈవో రాకేష్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అవసరమైన వారికి ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వీలుగా 10 టన్నుల వరకు ఎరువుల కోసం ఇండెంట్ పంపామని, బుధవారం మధ్యాహ్నం వరకు ఎరువుల నిల్వలు చేరుకుంటాయని తెలిపారు. ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పాల్దా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.