అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. రానున్న 36 గంటలు రాష్ట్రవ్యాప్తంగా వాన దంచి కొట్టే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జామున వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
అల్ప పీడన ప్రభావంతో కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో 150 నుంచి 250 మి.మీ. వర్షపాతం నమోదు కావొచ్చని అధికారులు పేర్కొన్నారు.
Heavy Rain Alert | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం తర్వాత వర్షాలు పెరిగే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 36 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడనుంది. కాగా.. నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. మరోవైపు ఐటీ శాఖ సైతం సాఫ్ట్వేర్ కంపెనీలకు పలు సూచనలు చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగులకు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించింది.
Heavy Rain Alert | పాఠశాలలకు సెలవులు
రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వర్షాలతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో పాఠశాలలకు సెలవులు (School Holidays) ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో బుధ, గురువారాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కూడా బుధ, గురువారాల్లో మధ్యాహ్నం వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Heavy Rain Alert | దంచికొట్టిన వాన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ (Warangal) జిల్లాల్లో వాన దంచికొట్టింది. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సైతం రాత్రంత వర్షం పడుతూనే ఉంది. మంచిర్యాలలోని భీమిని, కన్నెపల్లి గ్రామాల్లో 207మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెరువులు, వాగుల సమీపంలోకి వెళ్లొద్దని, రోడ్లపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తే దాటే సాహసం చేయొద్దని కోరారు.