అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ (Banjara Hills) ఎన్బీటీ నగర్లో గల పెద్దమ్మ గుడి (Peddamma Temple)ని ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు పలువురు బీజేపీ (BJP), హిందూ సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
Hyderabad | భారీ బందోబస్తు
హిందూ సంఘాల పిలుపు నేపథ్యంలో పెద్దమ్మ గుడి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెద్దమ్మగుడిలో కూల్చివేతలపై భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పోలీసులు బంజారాహిల్స్కు వెళ్లే అన్ని మార్గాలు మూసివేశారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
Hyderabad | రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramchandar Rao)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ ఆలయంలో పూజలకు ఆయన వచ్చే అవకాశం ఉందని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం దుండగుడు గుడిని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. రాంచందర్రావును హౌస్ అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఆలయాన్ని కూల్చిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాగా ఇటీవల ఆయన మాట్లాడుతూ.. బంజరాహిల్స్ ఉప ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసమే ప్రభుత్వం గుడిని కూల్చిన వారిపై చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.