అక్షరటుడే, వెబ్డెస్క్: Minimum balance | ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే పలు బ్యాంకులు ఫైన్ వేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాన్ని భారీగా పెంచింది. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా సోమవారం స్పందించారు. మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది బ్యాంకుల ఇష్టమని ఆయన తెలిపారు. దానిపై రిజర్వ్ బ్యాంక్కు నియంత్రణ ఉండదన్నారు.
బ్యాంకు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది బ్యాంకుల ఇష్టమని ఆర్బీఐ (RBI) గవర్నర్ స్పష్టం చేశారు. కాగా.. బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ సగటును లెక్కిస్తారు. దీని ప్రకారం కనీసం రూ.5 వేలు ఉండాలనే నిబంధన ఉంటే నెల మొత్తం కలిపి సగటున రూ.5 వేలు ఉంటే సరిపోతుంది. ఒక రోజు రూ.1.50 లక్షలు ఉంచి తీసేసినా.. ఫైన్ పడదు. అయితే ఆ మొత్తం ఎంత అనేది బ్యాంకులే నిర్ణయించుకుంటాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
Minimum balance | భారీగా పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు
దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ (SBI) మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా వరకు ఖాతాల్లో కనీస నగదు లేకుంటే జరిమానాలు విధించడం లేదు. కొన్ని బ్యాంకులు విధించినా.. తక్కువ ఫైన్ మాత్రమే వేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం కస్టమర్లు బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే భారీగా జరిమానా వేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఇటీవల మినిమం బ్యాలెన్స్ మొత్తాన్ని భారీగా పెంచి, కస్టమర్లకు షాక్ ఇచ్చింది.
Minimum balance | కొత్త ఖాతాదారులకు..
ఐసీఐసీఐ బ్యాంకులో ఆగస్టు 1 తర్వాత ఖాతా తీసుకునే వారికి పెంపు వర్తించనుంది. దీని ప్రకారం.. మెట్రో, నగర ప్రాంతాల్లో ఖాతా ఉంటే.. మినిమమ్ బ్యాలెన్స్ రూ.50 వేలు ఉండాలి. గతంలో రూ.10 వేలు ఉన్న ఈ మొత్తాన్ని ఐదు రెట్లు పెంచింది. సెమీ అర్బన్ ఏరియాలో కనీస నిల్వ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.10 వేలకు పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అయితే 2025 ఆగస్టు 1కు ముందు ఖాతా తీసుకున్న వారికి పాత నిబంధనలే వర్తించనున్నాయి. మినిమం బ్యాలెన్స్ లేకపోతే.. ఎంత తక్కువ ఉందో అందులో 6 శాతం, లేదా రూ.500 (ఏది తక్కువైతే అది) ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
ఓ వైపు ప్రభుత్వ రంగ (PSU) బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తి వేస్తుండగా.. ప్రైవేట్ బ్యాంకులు మొత్తాన్ని పెంచడంతో పాటు జరిమానా సైతం భారీగా వసూలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల తీరుపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీఐసీఐ మినిమం బ్యాలెన్స్ మొత్తాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.