అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | అత్యవసర సమయంలో పోలీసులకు ఫోన్ చేయడానికి ఉన్న డయల్ 100 (Dial 100)ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అనవసరంగా ఫోన్ చేసి సిబ్బందిని విసిగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని కూకట్పల్లిలో నివాసం ఉండే కేతావత్ పరశురామ్ ధర్పల్లి మండలం డీబీ తండాకు తీజ్ పండుగ కోసం వచ్చారు. ఈ నెల 8న మద్యం మత్తులో పలుమార్లు డయల్ 100కు ఫోన్ చేశాడు. డయల్ 100కు అనవసరంగా ఫోన్ చేసిన పరశురామ్ను సోమవారం నిజామాబాద్ (Nizamabad) సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరు పరిచారు. దీంతో నిందితుడికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై కల్యాణి తెలిపారు. అనవసరంగా డయల్ 100కు ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.