అక్షరటుడే, వెబ్డెస్క్ : Tollywood | తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో కొన్ని రోజులుగా నెలకొన్న కార్మికుల వేతనం పెంపుపై నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ (Producers) గిల్డ్ సభ్యులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల వేతనాల పెంపుపై కీలక ప్రతిపాదనలు తీసుకు వచ్చారు. ఈ మేరకు చర్చల అనంతరం నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.
Tollywood | మూడు విడతల్లో..
తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న అన్ని రంగాల కార్మికులకు 30శాతం వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ (Film Fedaration) నాయకులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జీతాలు పెంచకపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులుగా షూటింగ్ (Shootings)లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శనివారం కీలక సమావేశం నిర్వహించారు. మూడు విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారు.
తొలి ఏడాది 15 శాతం, రెండు, మూడో ఏడాది 5 శాతం చొప్పున జీతాలు పెంచుతామని ప్రకటించారు. రూ.2వేల లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 15 శాతం పెంచాలని, రూ.వేయిలోపు ఉన్నవారికి 20 శాతం పెంచాలని నిర్ణయించారు. అయితే చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. షరతులకు అంగీకరిస్తేనే వేతనాల పెంపు అమలు చేస్తామన్నారు. అయితే చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అనే వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వాలన్నదే తమ అభిప్రాయం అన్నారు. అయితే ఇప్పటికే రోజుకు రూ.5 వేలు తీసుకుంటున్న కార్మికుల జీతాలు పెంచమనడం సరికాదని నిర్మాతలు పేర్కొన్నారు.
Tollywood | నిర్మాతల నిర్ణయాన్ని అంగీకరించం
నిర్మాతలతో సినీ కార్మికుల ఫెడరేషన్ చర్చలు విఫలమైనట్లు అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతల షరతులను అంగీకరిస్తాం కానీ.. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. యూనియన్లను విడగొట్టేలా నిర్మాతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని తెలిపారు.