అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market | ట్రంప్ టారిఫ్ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మొదట ఒడిదుడుకులకు లోనై బేర్స్ పైచేయి సాధించినా.. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు తేరుకున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 281 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అక్కడి నుంచి కోలుకుని 159 పాయింట్లు పెరిగింది. అమ్మకాల ఒత్తిడితో ఆ తర్వాత మళ్లీ సూచీలు పడిపోయాయి.
ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ 610 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 110 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 78 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత 198 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో సూచీలు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 80,623 వద్ద, నిఫ్టీ (Nifty) 21 పాయింట్ల నష్టంతో 24,596 వద్ద స్థిరపడ్డాయి. భారత్ నుంచి యూఎస్కు ఎగుమతులు మన జీడీపీలో 2 శాతమే ఉండడం, ఐటీ (IT)) సేవలపై ఎలాంటి సుంకాలు విధించకపోవడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని ఆర్బీఐ (RBI) పేర్కొనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మార్చాయి. యూఎస్, భారత్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే సుంకాలు (Trump Tariffs) తగ్గుతాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో మధ్యాహ్నం సెషన్లో తిరిగి బుల్స్ పట్టు సాధించడంతో లాభాల బాట పట్టాయి.
Stock Market | కోలుకున్న సూచీలు..
ప్రథమార్థంలో భారీ నష్టాల దిశగా పయనించిన సూచీలు.. ద్వితీయార్థంలో కోలుకుని చివరికి లాభాలబాట పట్టాయి. బీఎస్ఈలో (BSE) ఐటీ 0.93 శాతం, హెల్త్కేర్ 0.53 శాతం, పీఎస్యూ బ్యాంక్ 0.32 శాతం, ఆటో 0.25 శాతం లాభాలతో ముగిశాయి. టెలికాం (Telecom) 0.59 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.41 శాతం, కమోడిటీ 0.37 శాతం, పవర్ ఇండెక్స్ 0.36 శాతం, పీఎస్యూ 0.28 శాతం, ఇన్ఫ్రా 0.26 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టపోయింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 18 కంపెనీలు లాభాలతో, 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 2.11 శాతం, ఎటర్నల్ 1.44 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.17 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.85 శాతం, మారుతి 0.73 శాతం పెరిగాయి.
Top Losers : అదానీ పోర్ట్స్ 1.55 శాతం, ట్రెంట్ 0.85 శాతం, టాటామోటార్ 0.85 శాతం, హెచ్యూఎల్ 0.74 శాతం, ఎంఅండ్ఎం 0.70 శాతం నష్టపోయాయి.