అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | కాళేశ్వరం నివేదికపై (Kaleshwaram Report) అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. కమిషన్ నివేదికపై మంత్రివర్గంలో (Cabinet Meeting) చర్చ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో అక్రమాలకు, కుంగిపోవడానికి నాటి సీఎం కేసీఆర్ (Former CM KCR) కారణమని కమిషన్ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని సీఎం తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో 2007లో ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరిట కేసీఆర్ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మించారన్నారు. దాని నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి తెలంగాణకు సాగునీటి వసతులు కల్పిస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు.
CM Revanth Reddy | మూడేళ్లకే కుంగిపోయింది
నిర్మాణం జరిగిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిందని సీఎం తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు పగళ్లు వచ్చాయన్నారు. ప్రాజెక్ట్లు ప్రమాదంలో పడ్డాయని ఎన్డీఎస్ఏ (NDSA), సాంకేతిక నిపుణులు చెప్పారన్నారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ లోపాలతో ప్రాజెక్ట్లు కుంగిపోయాయన్నారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తాను రాహుల్గాంధీతో కలిసి ప్రాజెక్ట్లను పరిశీలించినట్లు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేపడతామని మాట ఇచ్చామని చెప్పారు. ఈ మేరకు పీసీ ఘోష్ ఛైర్మన్గా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
CM Revanth Reddy | పేరు మార్చి.. అవినీతి
ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చి, రీ డిజైన్ పేరిట బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని సీఎం పేర్కొన్నారు. పేరు మార్చి.. స్థలాన్ని మార్చి అవినీతికి పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందన్నారు. దీనికి బాధ్యులైన వారి వివరాలను కమిషన్ తన నివేదికలో పొందుపరిచిందని చెప్పారు. ఈ నివేదికను మంత్రివర్గంలో ఆమోదించినట్లు తెలిపారు. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చ పెడతామన్నారు. అనంతరం కమిషన్ సూచనలు అమలు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని సీఎం తెలిపారు.