అక్షరటుడే, వెబ్డెస్క్: Crude Oil Imports | రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు చేస్తూనే ఉంటామని భారత కంపెనీలు ప్రకటించాయి. రష్యా నుంచి భారత కంపెనీలు (Indian Companies) ఆయిలు కొనుగోలు చేయడం ఆపేశాయని ట్రంప్ శనివారం వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్, భారత్ పెట్రోలియం, మంగళూరు రిఫైనరీలు (Mangalore Refineries) రష్యా నుంచి ఆయిలు దిగుమతులను నిలిపివేశాయని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్ (Trump) అది మంచి నిర్ణయం అన్నారు. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు కొనసాగుతాయని స్పష్టం చేశాయి.
Crude Oil Imports | దేశ ప్రయోజనాలే ముఖ్యం
దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని తేల్చి చెప్పాయి. రష్యా (Russia) నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సైతం తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అగ్రరాజ్యం అమెరికా భావించింది. ఇందులో భాగంగా నాటో దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకుడదని చెప్పింది. అంతేగాకుండా అమెరికా మిత్ర దేశాలు కూడా రష్యా నుంచి ముడి చమురు (Crude Oil) దిగుమతి చేసుకోకుండా ఒత్తిడి తెచ్చింది.
Crude Oil Imports | తలొగ్గని భారత్
రష్యా నుంచి చాలా దేశాలు ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపేశాయి. దీంతో ఆ దేశం భారత్, చైనాలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేస్తామని ముందుకు వచ్చింది. దీంతో భారత్ (India) రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో అమెరికా, నాటో దేశాలు పలుమార్లు ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపాలని భారతకు సూచించాయి. అయితే భారత్ మాత్రం ఆ దేశాల మాటలకు తలొగ్గకుండా ముడి చమురు దిగుమతి కొనసాగిస్తుంది. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుగోలు చేసే హక్కు తమకు ఉందని భారత్ స్పష్టం చేసింది.
Crude Oil Imports | సుంకాలతో భయపెట్టినా..
రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్పై భారీ సుంకాలు (Huge Tariffs) విధించాడు. ఇండియా నుంచి వచ్చే ఉత్పత్తులపై 25శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించాడు. రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు కొనుగోలు చేస్తుండడంతో అమెరికా సుంకాలు విధించింది. అయినా భారత్ మాత్రం ఆయిల్ కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. అమెరికాతో సుంకాల విషయం చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.