అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు పోనున్నాయి. ఉత్తరాదితో తెలంగాణను కలిపే కాజీపేట–బల్లార్షా (Kazipet–Ballarshah) మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్ (Railway Line) ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ మార్గంలో రెండు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. మూడో లైన్ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. త్వరలో పనులు పూర్తి చేసి నాలుగో లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. కాజీపేట నుంచి బల్లార్షా వరకు 234 కిలోమీటర్ల మేర నాలుగో లైన్ నిర్మించనున్నారు. దీనికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. జులై 19న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) రాష్ట్రంలో పర్యటించారు. నాలుగో లైన్ నిర్మాణం చేపడుతామని ఆ సమయంలో ఆయన తెలిపారు.
Railway Line | నిత్యం రైళ్ల రద్దీ
ఉత్తరాది రాష్ట్రాలతో దక్షిణాదిని అనుసంధానించే కాజీపేట–బల్లార్షా మార్గంలో నిత్యం వందల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రైళ్ల (Trains) రద్దీని దృష్టిలో పెట్టుకొని మూడో లైన్ నిర్మాణం చేపట్టారు. రైళ్లు అధికంగా తిరుగుతుండడంతో క్రాసింగ్ సమయంలో ప్రస్తుతం చాలా సమయం స్టేషన్లలో నిలిపి ఉంచాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మూడు, నాలుగో లైన్లు అందుబాటులోకి వస్తే క్రాసింగ్ల బాధ తప్పి.. వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. నాలుగు లైను నిర్మిస్తే గూడ్స్ కోసం సెపరేట్ ట్రాక్ వినియోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Railway Line | సర్వే పూర్తి
నాలుగు లైన్కు సంబంధించి అధికారులు సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం 205 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో 177 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో మహారాష్ట్ర పరిధిలో 46 కి.మీ. మేర పనులు పూర్తికాగా తెలంగాణలోని ఆసిఫాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, రేచినిరోడ్-బెల్లంపల్లి-మందమర్రి మధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగో లైన్ను రూ.3 వేల కోట్లతో 234 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఇందులో తెలంగాణలో 80 శాతం, మహారాష్ట్రలో 20 శాతం ఉంది. ప్రస్తుతం సర్వే పూర్తి కావడంతో అధికారులు డీపీఆర్ రూపొందిస్తున్నారు.