అక్షరటుడే, వెబ్డెస్క్: IND vs ENG | ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా (Team India) తడబడింది. వర్షంతో ఆటకు తరచూ అంతరాయమవుతూ ఉన్నా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత్ టాప్ ఆర్డర్ తేలిపోయింది. తొలి రోజు భారత్ 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 204 రన్స్ చేసింది. కరుణ్ నాయర్(Karun Nair) (52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ (19 బ్యాటింగ్) అండగా ఉన్నాడు. వాతావరణం పూర్తిగా ఓవర్కాస్ట్ ఉండడంతో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించలేదు. ఈ అవకాశాన్ని ఇంగ్లండ్(England) పేసర్లు మెరుగ్గా వినియోగించుకున్నారు.
IND vs ENG | బౌలర్ల హవా..
గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్(Chris Woakes) ఒక వికెట్ పడగొట్టాడు. వర్షం కారణంగా మొత్తం 64 ఓవర్ల ఆటకే పరిమితం కాగా, రెండో రోజు ఆటపై అందరిలో ఆసక్తి ఉంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్కి ఆరంభం నుంచే ఎదురు దెబ్బలు తగిలాయి. యశస్వి జైస్వాల్ (2) అట్కిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగితే, కేఎల్ రాహుల్ (14) వోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సాయిసుదర్శన్, గిల్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. 23 ఓవర్లలో 72/2 వద్ద భారత్ లంచ్కు వెళ్లింది.విరామం తర్వాత తిరిగి ఆట ప్రారంభమైన వెంటనే గిల్(Shubhman Gill) రన్ అవుట్ కావడం మ్యాచ్పై ప్రభావం చూపింది. మూడో వికెట్కు వచ్చిన 44 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
ఆ తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ 85/3 వద్ద మైదానం వీడింది. భారీ వర్షం(Heavy Rain), చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్తో ఆట రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఆఖరి సెషన్లో భారత్ వరుసగా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సాయిసుదర్శన్ (38), జడేజా (9) జోష్ టంగ్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. తర్వాత ధ్రువ్ జురెల్ (19) అట్కిన్సన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ ధైర్యంగా ఆడి 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సహకారం అందించడంతో భారత్ 200 పరుగుల మార్క్ దాటింది. కరుణ్-సుందర్ భాగస్వామ్యం రెండో రోజు తమ జోరు కొనసాగిస్తే జట్టు పుంజుకునే అవకాశముంది.