Latest Crime | వెళ్లిపోయిన పెళ్ళాన్ని తెచ్చుకుంటే.. ప్రాణాలు తీయాలని చూసింది..
Latest Crime | వెళ్లిపోయిన పెళ్ళాన్ని తెచ్చుకుంటే.. ప్రాణాలు తీయాలని చూసింది..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:Hyderabad : కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఇదేనేమో.. నువ్వు నాకొద్దని మూడేళ్ల క్రితం వెళ్లిపోయిన పెళ్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే రంకు మొగుడుతో కలిసి భర్తనే కడతేర్చాలని పన్నాగం పన్నింది. ఫూటుగా మద్యం తాగించి తుక్కు కింద కొట్టి మరణించాడని అనుకుని వెళ్లిపోయారు ఆ లస్ట్ జంట.. వారి దెబ్బలకు నరకం అంచుల వరకు వెళ్లి, బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తెలంగాణ(Telangana)లోని వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది.

Hyderabad : పోలీసుల కథనం ప్రకారం..

పెద్దగూడెం తండాకు చెందిన నానావత్ రాందాస్‌ నాయక్‌కు అదే వనపర్తి జిల్లాలోని మర్రికుంటకు చెందిన జ్యోతితో 2009లో పెళ్లి జరిగింది. హైదరాబాద్ శివారు బాలానగర్​లో వీరు కూలీ పనులు చేసుకుంటూ సంసార జీవితం నెట్టుకొచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

కాగా, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మూడేళ్ల క్రితం విడిపోయారు. ఈ క్రమంలో రాందాస్‌, అతని కుటుంబసభ్యులపై జ్యోతి వనపర్తి పోలీస్‌స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది. అప్పటి నుంచి పెళ్లాం మొగుడు వేరువేరుగా ఉంటున్నారు. రాందాస్‌ సొంతూరులో పనులు చేసుకుంటున్నాడు. జ్యోతి నిజాంపేట్‌ రాజీవ్‌గృహకల్పలో ఉంటోంది. ప్రగతినగర్‌లో జొన్నరొట్టెలు విక్రయిస్తూ ఉండేది. తన ఇద్దరు కుమార్తెలను మర్రికుంటలోని తల్లిగారింట్లో ఉంచింది.

Hyderabad : ఇటీవల పెద్ద మనుషులు…

నెల రోజుల క్రితం జరిగిన పెద్దమనుషులు కలగజేసుకున్నారు. దంపతుల మధ్య సయోధ్య కుదుర్చారు. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని, కలిసి ఉండాలని సర్ది చెప్పడంతో అప్పటి నుంచి రాందాస్-జ్యోతి కలిసి ఉంటున్నారు.

Hyderabad : ఇక తెర వెనుక పరిశీలిస్తే..

మూడేళ్లుగా భర్తతో దూరంగా ఉన్న జ్యోతి.. గోపీ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఇప్పుడు భర్త రావడంతో వీరి అక్రమ బంధానికి అడ్డుగా భావించింది. ఎలాగైనా తన మొగుడి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఇందుకు బంధువు హేమంత్‌నాయక్‌ సహకారం తీసుకుంది.

ఈ నెల 26న రాత్రి 9 గంటల సమయంలో రొట్టెలు చేస్తున్న జ్యోతి.. భర్తను తన వద్దకు రావాలని కోరింది. పథకంలో భాగంగా.. రాందాస్​ను గోపీ బైక్​పై ఎక్కించుకుని జ్యోతి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి రాందాస్​ను వైన్స్ కు తీసుకెళ్లాడు. అక్కడ బీర్లు కొనుగోలు చేశారు.

అక్కడి నుంచి లహరి గ్రీన్​ పార్క్​ ప్రాంతానికి రాందాస్​ను గోపి తీసుకెళ్లాడు. వీరి కోసం అక్కడికి అప్పటికే హేమంత్​నాయక్​ చేరుకున్నాడు. ఆ తర్వాత గోపి తన స్నేహితుడు శ్రీకాంత్​ను పిలించుకున్నాడు. దీంతో శ్రీకాంత్​తోపాటు కరీముద్దీన్​, శుభోద్​ చేరుకున్నారు.

వీరంతా వచ్చేలోగా.. రాందాస్​తో బీర్లు తాగించి మత్తులోకి చేరుకునేలా చేశారు. అంతా చేరుకున్నాక అదునుచూసి మూకుమ్మడిగా బీరు సీసాలు, రాళ్లతో దాడికి దిగారు. విపరీతంగా చావు దెబ్బలు కొట్టారు. ఇక రాందాస్​ చనిపోయాడని భావించి అంతా అక్కడి నుంచి పారిపోయారు.

తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన రాందాస్​కు​ అర్ధరాత్రి 12 గంటలకు స్పృహలోకి వచ్చాడు. తీవ్రంగా గాయపడిన అతడు.. రక్తమోడుతున్నా బలవంతగా నడుచుకుంటూ తన తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే హాస్పిటల్​కు తీసుకెళ్లి చికిత్స అందించి, బాచుపల్లి​ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన జరిగిన ప్రాంతం దుండిగల్​ పీఎస్​ పరిధిలోకి వస్తుండటంతో వారు జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, దుండిగల్​ ఠాణాకు బదిలీ చేశారు.

దుండిగల్​ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు జ్యోతి, గోపీ, హేమంత్​ నాయక్​, శుభోద్​, శ్రీకాంత్​, కరీముద్దీన్​లను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్​కు తరలించారు.