అక్షరటుడే, వెబ్డెస్క్: Fighter Jet Crash | అగ్రరాజ్యం అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలింది. అత్యంత ఆధునికమైన ఎఫ్–35 ఫైటర్ జెట్ కాలిఫోర్నియాలో (California) కూలిపోయింది.
ఈ ప్రమాదంలో పైలెట్ (Pilot) సురక్షితంగా బయట పడ్డాడు. కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ (Naval Air Station) సమీపంలో అమెరికా నౌక దళానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం కూలిపోయింది. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు లెమూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్-35 పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానం కూలడంతో భూమిపై ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.
Fighter Jet Crash | భారత్లో నిలిచిన ఎఫ్–35
బ్రిటిష్ యుద్ధ విమానం ఎఫ్–35 ఇటీవల భారత్లో రోజుల తరబడి నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఇంధనం అయిపోవడం, సాంకేతిక సమస్యలతో పైలెట్ విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే విమానంలో ఇంధనం నింపిన తర్వాత కూడా అది ఎగరేక పోయింది. హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో విమానం నిలిచిపోయింది. దీంతో బ్రిటిష్ రాయల్ నేవికి చెందిన నిపుణులు రోజుల తరబడి శ్రమించడంతో 35 రోజుల తర్వాత ఎఫ్–35 టేకాఫ్ అయింది. 35 రోజులు విమానాన్ని పార్క్ చేసినందుకు తిరువనంతపురం ఎయిర్పోర్ట్ బ్రిటిష్ నేవి నుంచి రోజుకు రూ.26,261 చొప్పున అద్దె వసూలు చేశారు.
Fighter Jet Crash | అధునాతన విమానాల్లో లోపాలు
అమెరికా (America) ఎఫ్–35 యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ప్రపంచంలో ఇవి అత్యంత అధునాతన విమానాలని అగ్రరాజ్యం చెబుతోంది. అయితే ఈ విమానాల్లో తరచు సాంకేతిక సమస్యలు వస్తుండటంతో ఆందోళన నెలకొంది. ఇటీవల భారత్లో ఇంగ్లాండ్కు చెందిన ఎఫ్–35 విమానం 35 రోజులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలో ఫైటర్ జెట్(Fighter Jet) కూలిపోయింది.
ప్రస్తుతం ఉన్న యుద్ధ విమానాల్లో వీటికే అధిక ధర ఉంది. అంతేగాకుండా వీటి నిర్వహణ ఖర్చు కూడా బాగానే ఉంది. అంతపెట్టి కొనుగోలు చేసినా సాంకేతిక సమస్యలు తలెత్తుండడంతో పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. 2025 ప్రారంభంలో అలాస్కాలో F-35A కూలిపోయింది. గతంతలో దక్షిణ కరోలినా, జపాన్లో యుద్ధ విమానాలు కూలిపోయాయి.
Fighter Jet Crash | భారత్ ఇచ్చేందుకు అంగీకారం
అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్కు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఇప్పటికే పలు దేశాలు అమెరికా నుంచి వీటిని కొనుగోలు చేశాయి. అయితే భారత్ మాత్రం కొనుగోలుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇండియా ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న సుఖోయ్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో సేవలు అందిస్తున్నాయి.