అక్షరటుడే, వెబ్డెస్క్: Indiramma Canteens | హైదరాబాద్ (Hyderabad) నగరంలో సామాన్యుల కోసం ప్రభుత్వం మరో సదుపాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రూ.5కే భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ (GHMC) ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే బ్రేక్ఫాస్ట్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్యకరమైన టిఫిన్ కేవలం రూ.5కే సోమవారం నుంచి శనివారం వరకు అందించనున్నారు. మెనూలో ఇడ్లీ, పూరి, పొంగల్, ఉప్మా వంటి పదార్థాలు ఉన్నాయి.
Indiramma Canteens | మొదట 60 కేంద్రాల్లో..
ప్రతి టిఫిన్కు సుమారు రూ.19 ఖర్చు కాగా, అందులో రూ.5 మాత్రమే ప్రజల నుంచి వసూలు చేస్తారు. మిగిలిన రూ.14 GHMC భరించనుంది. ప్రారంభ దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 60 కేంద్రాల్లో టిఫిన్ అందుబాటులో ఉంటుంది. తరువాతి దశలో ఈ పథకాన్ని 150 క్యాంటీన్లకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకాన్ని నిర్వహించే బాధ్యతను ఇప్పటికే రూ.5 భోజన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ (Hare Rama Hare Krishna Movement) తీసుకుంది.
పాత క్యాంటీన్ స్టాల్స్ (Canteen Stalls) పూర్తిగా వినియోగానికి అర్హత కోల్పోవడంతో రూ.11.43 కోట్ల వ్యయంతో కొత్త స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్టాల్స్ పరిశుభ్రంగా ఉండేలా, నాణ్యత ప్రమాణాలు పాటించేలా GHMC ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పథకం ప్రధానంగా బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, అభివృద్ధిలో వెనుకబడ్డ వర్గాల కోసం రూపుదిద్దుకుంది. ప్రజల ఆర్థిక భారం తక్కువచేసే ఉద్దేశంతో, స్వల్ప ధరకే అధిక పోషక విలువలు గల ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు. 5 రూపాయల భోజనానికి (5 Rupees Meals) అద్భుతమైన రెస్పాన్స్ రాగా , ఇప్పుడు 5 రూపాయల బ్రేక్ఫాస్ట్కు కూడా విశేష ఆదరణ దక్కనుందని అంటున్నారు.