అక్షరటుడే, హైదరాబాద్: DISCOM : రాష్ట్రంలో విద్యుత్తు విభాగం (power sector) ప్రక్షాళన చేయడానికి అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. సంస్కరణల్లో భాగంగా కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఇంధన శాఖపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. NPDCL, SPDCL లతో పాటు కొత్తగా మరో డిస్కమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోకి వ్యవసాయ రంగంతో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు(free household electricity), స్కూళ్ళు (schools), కాలేజీల(colleges)కు ఉచిత విద్యుత్తు పథకాలు (free electricity schemes) తీసుకురావాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలన్నారు.
కొత్త డిస్కమ్ ఏర్పాటు వల్ల ఇపుడున్న డిస్కమ్ల పనితీరు మెరుగుపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. డిస్కమ్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని పేర్కొన్నారు.
DISCOM | వడ్డీ రుణాలతో డిస్కమ్లు డీలా..
డిస్కమ్ల పునరవ్యవస్తీకరణతో పాటు విద్యుత్తు సంస్థలపై రుణ భారం తగ్గించాలని అధికారులకు సీఎం సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని అదేశించారు. 10 శాతం వరకు వడ్డీపై తీసుకున్న రుణాలతో డిస్కమ్లు డీలా పడ్డాయని, తక్కువ వడ్డీ ఉండేలా రీస్ట్రక్చర్ చేసుకోవాలని ఆదేశించారు.
DISCOM | ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్తు వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా కలెక్టర్లు అనువైన భవనాలను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని చెప్పారు.
DISCOM | సచివాలయంలో సోలార్ రూఫ్ పార్కింగ్..
ఆర్ అండ్ బీ (R&B) శాఖతో సమన్వయం చేసుకుని రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్తు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో వాహనాల పార్కింగ్నకు అనువుగా సోలార్ రూఫ్టాప్ షెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
DISCOM | సోలార్ గిరి జల వికాసం..
ఇందిర సోలార్ గిరి జల వికాసం (Indira Solar Giri Jal Vikasam) పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. వచ్చే మూడేళ్లలో 2 లక్షల 10 వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్తు పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలన్న సూచించారు.