అక్షరటుడే, వెబ్డెస్క్: IT Refund | ఆదాయపన్ను(Income tax) చెల్లింపుదారులకు శుభవార్త. ఇకపై రిఫండ్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకుంది. దీంతో రిటర్న్లు దాఖలు చేసిన గంటల వ్యవధిలోనే రిఫండ్ అవుతున్నాయి. ఈ ఏడాది ఐటీఆర్ (ITR) 5 దాఖలు చేసిన పలువురు పన్ను చెల్లింపుదారులు తాము ఐటీ రిటర్నులు ఫైల్ చేసిన 4 గంటల వ్యవధిలోనే రిఫండ్లు పొందినట్లు తెలుస్తోంది. ఇది ఐటీఆర్ ప్రాసెసింగ్ విషయంలో గొప్ప మార్పుగా అభివర్ణింపబడుతోంది.
గతంలో ఐటీ రిఫండ్లు (IT refunds) పొందడానికి మూడు నెలలపైనే సమయం తీసుకునేది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డిజిటల్ రంగంలో వస్తున్న కొత్తకొత్త మార్పులతో ఐటీఆర్ల ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతమైంది. దీంతో రిఫండ్ సమయం నెలలనుంచి గంటల్లోకి తగ్గిపోయింది. ఇది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే అంశం.
ఐటీశాఖ e-ఫైలింగ్ పోర్టల్లో ఫారం- 1 ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 4 గంటల్లోనే రిఫండ్ పొందినట్లు నోయిడాకు చెందిన అరుణ్ ప్రకాశ్ అనే వ్యక్తి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఐటీ రిటర్న్ (IT Returns) దాఖలు చేశానని, అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో రిఫండ్ తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందని పేర్కొన్నాడు.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా షేర్ చేశాడు. తమ క్లయింట్లలో చాలామంది ఐటీఆర్ దాఖలు చేసిన అదేరోజు రిఫండ్ పొందారని పన్నుల రంగంలో నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఇది ఐటీ శాఖ డిజిటల్ సామర్థ్యానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఐటీ రిఫండ్ల గురించిన వార్తలు గూగుల్లోనూ (Google) వైరల్ అవుతున్నాయి. ఐటీ రిటర్నులు దాఖలు చేసి రిఫండ్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వార్తలను ఆసక్తిగా చదువుతున్నారు. అయితే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ మాత్రం ఇప్పటికీ ఐటీఆర్ రిఫండ్ పన్ను చెల్లింపుదారుల ఖాతాలలో జమ కావడానికి నాలుగైదు వారాల సమయం పడుతుందని చూపిస్తోంది.
IT Refund | వేగానికి కారణాలేమిటంటే..
- డిజిటల్ ప్రాసెసింగ్ (Digital processing) కావడంతో పాటు రిటర్న్ల ప్రాసెసింగ్, ధ్రువీకరణలను ఆటోమేటెడ్ చేశారు.
- పాత ఎక్సెల్ సిస్టమ్ స్థానంలో జేఎస్వోఎన్(JSON) ఫార్మాట్ ఉపయోగిస్తున్నారు. ఇది డాటా రీడిరగ్ను వేగవంతం చేస్తుంది.
- e-వెరిఫై చేసిన వెంటనే రిఫండ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది.
బ్యాంకు ఖాతా ప్రీ వ్యాలిడేషన్, పాన్ కార్డ్తో ఆధార్ అనుసంధానం వంటి దశలు కూడా రిఫండ్ వేగవంతం కావడానికి దోహదపడుతున్నాయని భావిస్తున్నారు