అక్షరటుడేర, వెబ్డెస్క్ : Bihar CM | అసెంబ్లీ ఎన్నికల ముందర బీహార్లో వరాల జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే వివిధ వర్గాలపై వరాలు కురిపించిన ముఖ్యమంత్రి నితీశ్కుమార్(Bihar CM Nitish Kumar) తాజాగా ఆశ కార్యకర్తలపై దృష్టి సారించారు. వారి వేతనాన్ని రెండింతలు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Elections) ముందు ముఖ్యమంత్రి వరుస ప్రకటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో పని చేస్తున్న ఆశ, మమత కార్యకర్తలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేస్తున్నట్లు X లో పోస్టు చేశారు.
Bihar CM | రూ.2 వేలు పెంపు..
ఆశ, మమత కార్మికులకు ప్రస్తుతం నెలకు రూ.ఒక వెయ్యి చొప్పున ప్రోత్సాహక నగదును అందిస్తున్నారు. అయితే, దీన్ని రూ.3 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. అలాగే, మమతా కార్మికులకు ప్రతి డెలివరీకి ఇచ్చే మొత్తాన్ని (రూ.300) రెట్టింపు (600) చేస్తున్నట్లు తెలిపారు. “నవంబర్ 2005లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మేము విస్తృతంగా కృషి చేశాము. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో ఆశా, మమతా కార్మికులు గణనీయమైన పాత్ర పోషించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో ఆశా, మమతా కార్మికుల(Mamata Workers) కీలకమైన సహకారాన్ని గౌరవిస్తూ, వారి గౌరవ వేతనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. ఆశా కార్యకర్తలకు(ASHA Workers) ఇప్పుడు రూఇస్తున్న .1,000కి బదులుగా రూ.3 వేల ప్రోత్సాహక మొత్తాన్ని అందిస్తాం. అలాగే, మమతా కార్మికులకు ఇస్తున్న రూ.300కి బదులుగా రూ.600 ప్రోత్సాహక మొత్తాన్ని అందిస్తాం. ఇది వారి మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తుంది” అని ముఖ్యమంత్రి తన పోస్టులో పేర్కొన్నారు.
Bihar CM | వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు..
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి నితీశ్ కొంతకాలంగా వివిధ వర్గాలపై వరాలు కురిపిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు. వితంతువు మహిళలకు నెలవారీ పెన్షన్లను రూ.400 నుంచి రూ.1100 కు పెంచారు. అలాగే, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని, జూలై బిల్లు నుంచి వినియోగదారులు దాని ప్రయోజనాలను పొందుతారని చెప్పారు. బీహార్ ప్రభుత్వం(Bihar Government) రాబోయే ఐదు సంవత్సరాలలో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ప్రకటించారు. ‘బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం'(‘Bihar Patrakar Samman Pension Scheme’) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్ను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జూలై 26న ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు గతంలో నెలకు రూ.6 వేలు ఇస్తుండగా, దాన్ని రూ.15 వేలకు పెంచారు.