Nagarjuna Sagar
Nagarjuna Sagar | నాగార్జున సాగర్​కు భారీగా వరద.. తెరుచుకున్న గేట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Nagarjuna Sagar | ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది (Krishna River) పరవళ్లు తొక్కుతోంది. దీంతో నాగార్జున సాగర్​కు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారడంతో మంత్రులు ఉత్తమ్ ​కుమార్​రెడ్డి (Uttam Kumar Reddy),  అడ్లూరి లక్ష్మణ్​కుమార్ (Adluri Laxman Kumar)​ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.6 అడుగులకు నీరు చేరింది. ఎగువన నుంచి 2,01,743 క్యూసెక్కులు ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో మంగళవారం ఉదయం 11:30 గంటలకు మంత్రులు, నాగర్జున సాగర్​ ఎమ్మెల్యే రఘువీర్​రెడ్డి కృష్ణమ్మ హారతి ఇచ్చి గేట్లు ఎత్తారు.

Nagarjuna Sagar | 18 ఏళ్ల తర్వాత..

ప్రస్తుతం కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దీంతో ఆ నదిపై గల జూరాల (Jurala), శ్రీశైలం(Srisailam), నాగార్జున సాగర్​ నిండుకుండల్లా మారాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. నాగర్జున సాగర్​ దిగువన గల పులిచింతల ప్రాజెక్ట్​ కూడా వరద ఇలాగే కొనసాగితే రెండు, మూడు రోజుల్లో నిండే అవకాశం ఉంది. అయితే జులైలో నాగార్జున సాగర్​ గేట్లు ఎత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దిగువకు నీటిని వదలడంతో నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉందడాలని అధికారులు సూచించారు.

Nagarjuna Sagar | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​లోకి 2,39,601 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 2,28,900 క్యూసెక్కుల ఔట్​ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 883 అడుగుల(204.7 టీఎంసీలు)కు నీరు చేరింది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు.