అక్షరటుడే, ఇందూరు: Rajiv Gandhi Hanumanthu | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి (Joint District Special Officer) రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. జిల్లాలో ముఖ్యంగా శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ (Sriramsagar Back water) ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
Rajiv Gandhi Hanumanthu | చేపల వేటకు వెళ్లొద్దు..
ఎస్సారెస్పీ (SRSP) పరివాహక ప్రాంతంతో పాటు కాల్వలు, చెరువులు, ఇతర జలాశయాల్లో ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా చూడాలని ప్రత్యేకాధికారి సూచించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా ఆయా శాఖలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
వరద జలాలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజల రాకపోకలు సాగించకుండా నిషేధించాలని తెలిపారు. గతంలో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఘటనలు ఉన్నాయని, అలాంటి ప్రదేశాలకు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రం నుంచి సహాయక బృందాలు పంపేలా చూస్తామన్నారు.
లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వర్షపు నీరు నిలిచే కంఠేశ్వర్ (kanteswar), రైల్వే కమాన్ (railway cammon), ముబారక్ నగర్ (Mubaraka anagar) తదితర ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, అందరికీ సరఫరా అయ్యేలా ప్రణాళిక రూపొందిచాలని చెప్పారు.
Rajiv Gandhi Hanumanthu | కంట్రోల్ రూమ్ల ఏర్పాటు..
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్తో పాటు అగ్నిపాపక శాఖ, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎక్కడ ఇబ్బందులు ఏర్పడినా..08462 – 220183కు సమాచారం అందించాలన్నారు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ అందిస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నామన్నారు.
నిజామాబాద్ నగరంలో శిథిలావస్థకు చేరుకున్న 167 ఇళ్ల యజమానులకు నోటీసులు అందించినట్లు తెలిపారు. జిల్లాలో పరిస్థితి పూర్తి అదుపులో ఉందని పేర్కొన్నారు. విషజ్వరాలు ప్రబలిన కాల్పోల్ తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, తగిన చికిత్స అందిస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.