అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. శనివారం ఉదయం ఇందిరానగర్ నుంచి బస్టాండ్ వరకు పది మందిపై దాడిచేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలపై దాడి చేస్తూ గాయపర్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్సల నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆస్పత్రిలో కుక్కకాటు బాధితులకు (dog bite victims) చికిత్స అందించారు.
కాగా.. తీవ్రంగా గాయపడిన బాధితులకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో బాధితులను కామారెడ్డి, బాన్సువాడ ఆస్పత్రులకు (Kamareddy and Banswada hospitals) రిఫర్ చేశారు. ఈ విషయమై పలువురు బాధితులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సకాలంలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని నినాదాలు చేశారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఎల్లారెడ్డి పట్టణంలో (Yellareddy town) పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలతో పాటు కోతుల దాడులు సైతం అధికమయ్యాయని.. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికైనా కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.