MP Shashi Tharoor
MP Shashi Tharoor | పార్టీ ప్ర‌యోజ‌నాల కంటే దేశానికే ప్రాధాన్యం.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Shashi Tharoor | పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్ర‌యోజ‌నాల‌కే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శశి థరూర్ (former minister Shashi Tharoor) స్ప‌ష్టం చేశారు. దేశం ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు విభేదాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని, దేశం కోసం క‌లిసి రావాల‌ని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వానికి (central government) అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తూ సొంత పార్టీ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న శ‌శిథ‌రూర్ కొచ్చిలోని ఓ పాఠ‌శాల జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సొంత పార్టీ నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఓ విద్యార్థి ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌గా, కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (former Prime Minister Jawaharlal Nehru) గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉటంకిస్తూ.. “భారతదేశం చనిపోతే ఎవరు బ్రతుకుతారు?” అని థరూర్ ప్ర‌శ్నించారు. జాతీయ ఐక్యత రాజకీయ వైరాన్ని అధిగమించాలని పేర్కొన్నారు.

MP Shashi Tharoor | దేశం కోసం క‌లిసి రావాలి..

దేశమే ముందు అని, ఆ త‌ర్వాతే పార్టీలు, రాజ‌కీయాల‌ని (Politics) థ‌రూర్ స్ప‌ష్టం చేశారు. నా దృష్టిలో దేశం ముందు, పార్టీలు దేశాన్ని మెరుగుప‌రిచే సాధ‌నాల‌ని తెలిపారు. “దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు మీ విభేదాలను పక్కన పెట్టండి. దేశం కోసం ముందుకు రావాలి. అప్పుడు మాత్రమే మనమందరం జీవించగలమ‌ని” చెప్పారు. పార్టీలు దేశానికి సేవ చేయడానికి ఒక వాహనం మాత్రమే అని పునరుద్ఘాటించారు. మీరు ఏ పార్టీకి చెందిన వారైనా, ఆ పార్టీ లక్ష్యం దాని మార్గంలో మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమేన‌న్నారు.

MP Shashi Tharoor | అది న‌మ్మ‌క‌ద్రోహ‌మేలా అవుతుంది?

భావ‌జాలాలు వేరుగా ఉండొచ్చ‌ని, అంతిమంగా దేశ‌మే ప్ర‌ధాన‌మ‌ని గుర్తుంచుకోవాల‌ని తిరువ‌నంత‌పురం ఎంపీ అయిన శ‌శిథ‌రూరు (MP Shashi Tharoor) పేర్కొన్నారు. పెట్టుబడిదారీ విధానం, సోషలిజం, నియంత్రణ, స్వేచ్ఛా మార్కెట్ వంటి వాటిపై పార్టీలల‌కు వేర్వేరు భావజాలాలు ఉండవచ్చ‌ని, అయితే అవన్నీ మెరుగైన, సురక్షితమైన భారతదేశాన్ని ఏర్ప‌రించేందుకు మాత్ర‌మే కట్టుబడి ఉండాలని థరూర్ నొక్కి చెప్పారు. “రాజకీయాలు అంటేనే పోటీత‌త్వం. నాలాంటి వ్యక్తులు మన పార్టీలను గౌరవిస్తాం. కానీ జాతీయ భద్రత దృష్ట్యా మనం ఇతర పార్టీలతో సహకరించాలి అని చెప్పినప్పుడు, కొన్నిసార్లు పార్టీలు దీనిని నమ్మకద్రోహంగా భావిస్తాయి. అది పెద్ద సమస్యగా మారుతుంద‌ని” కాంగ్రెస్ నేత‌ల (Congress leaders) వైఖ‌రిని త‌ప్పుబట్టారు.

“మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో నేను తీసుకున్న వైఖరి కారణంగా చాలా మంది నన్ను విమర్శించారు.. కానీ ఇది దేశానికి సరైనదని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను నా వైఖరికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని” తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో (Congress high command) మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగితే స్పందించేందుకు థరూర్ నిరాకరించారు.