అక్షరటుడే, వెబ్డెస్క్: Nimisha Priya | కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాకు యెమెన్(Yemen)లో ఈ నెల 16న ఉరిశిక్ష విధించనున్నారు. హత్య కేసులో అరెస్టయిన ఆమెకు అక్కడి కోర్టులు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ప్రాణాలు కాపాడడానికి కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయి.
ఈ మేరకు తాజాగా కేరళ సీఎం విజయన్(Kerala CM Vijayan) ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి లేఖ రాశారు. యెమెన్ జైల్లో ఉన్న నిమిషా ప్రియా విడుదలపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఆమె ప్రాణాలను కాపాడడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విన్నవించారు.
Nimisha Priya | సుప్రీంకోర్టులో విచారణ
కేరళ నర్సు నిమిషా అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) లో సైతం విచారణ జరిగింది. ఉరిశిక్ష నుంచి నిమిషాను రక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం వాదనలు విన్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ నిమిషా(Nimisha Priya)ను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అయితే ఈ కేసులో కేంద్రం జోక్యం పరిమితమేనని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ కౌన్సిల్ వాదిస్తూ.. యెమెన్ అన్ని దేశాల్లా కాదని పేర్కొంది. కేంద్రం ఏం చేయగలదో అన్ని చేసిందని కౌన్సిల్ తరఫు న్యాయవాది తెలిపారు. ఇక చేయగలిగింది ఏమి లేదని స్పష్టం చేశారు. దీంతో జులై 18కి సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కాగా.. ఈ నెల 16నే నిమిషాను ఉరి తీయడానికి యెమెన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Nimisha Priya | అసలు ఏం జరిగిందంటే?
కేరళ(Kerala)కు చెందిన నిమిషా ప్రియ నర్స్గా పనిచేయడానికి 2008లో యెమెన్ దేశానికి వెళ్లింది. అక్కడ కొన్నాళ్ల పాటు పలు ఆస్పత్రుల్లో పని చేసింది. అనంతరం సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే యెమెన్ రూల్స్ ప్రకారం.. ఇతర దేశస్తులు అక్కడ వ్యాపారం చేయాలంటే స్థానికులను భాగస్వాములుగా నియమించుకోవాలి. ఈ రూల్ ఉండడంతో నిమిషా తలాల్ అబ్దో మహది(Talal Abdo Mahdi) అనే వ్యక్తిని బిజినెస్ పార్టనర్గా చేర్చుకుంది.
క్లినిక్ పెట్టిన తర్వాత వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో నిమిషా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తలాల్ అబ్దో మహదిని పోలీసులు అరెస్ట్ చేయగా జైలుకు వెళ్లి 2016లో విడుదలయ్యాడు. బయటకు వచ్చిన అనంతరం అతడు నిమిషాను వేధించడం ప్రారంభించాడు. ఆమె పాస్పోర్టు తన వద్ద పెట్టుకొని ఇబ్బంది పెట్టాడు.
దీంతో అతడిని చంపి పాస్పోర్టు(Pass Port) తీసుకొని పారిపోవాలని నిమిషా ప్లాన్ వేసింది. ఈ మేరకు 2017లో ఇంజెక్షన్ ఇచ్చి అతన్ని హత్య చేసింది. అనంతరం పాస్పోర్టు తీసుకొని ఇండియాకు తిరిగి వస్తుండగా అక్కడ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు మరణ శిక్ష విధించింది.