అక్షరటుడే, వెబ్డెస్క్: Deputy CM | బీజేపీ దళితులు, ఆదివాసీల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని, వారి గౌరవానికి భంగం కలిగిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. హెచ్సీయూ స్కాలర్ ఆత్మహత్యకు కారణమైన రాంచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేశారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న భట్టి.. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్సీయూ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల(Rohith Vemula) ఆత్మహత్యకు కారణమైన రాంచందర్ రావు(Ramchandra Rao)ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఆయనకు ఆ పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం పునరాలోచన చేయాలన్నారు. రోహిత్ వేముల మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా పదవులు ఇస్తున్న బీజేపీ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Deputy CM | యూనివర్సిటీల నిర్వీర్యం..
కేంద్ర ప్రభుత్వం (Central Government) యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందని భట్టి ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని భట్టి అన్నారు. దళితులు, ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి బీజేపీ పదవులు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ (BJP) వ్యవహరిస్తోందని, ఇది చాలా ఆందోళనకరమన్నారు. దేశంలో వందల ఏళ్లుగా వెనుకబడిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని తెలిపారు. ప్రతీ పౌరుడి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
Deputy CM | త్వరలోనే రోహిత్ వేముల చట్టం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్కు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రాంచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి (Telangana BJP Presidentship) ఇచ్చారన్నారు.
2016లో యూనివర్శిటీ యాజమాన్యం రోహిత్ వేములపై చర్యలు తీసుకునేలా యూనివర్సిటీ వద్ద రాంచందర్ రావు ఆందోళన చేశారని భట్టి గుర్తుచేశారు. ప్రస్తుతం దళితులు భయపడేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విచారణ జరుపుతోందన్నారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని, దీనిపై న్యాయశాఖ పని చేస్తోందని చెప్పారు. రోహిత్ వేముల చనిపోతే ఆ కుటుంబాన్ని కనీసం కేసీఆర్ పరామర్శించలేదని విమర్శించారు.