అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | కొందరు వ్యక్తులు తమ లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ (Counterfeit) వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఇటీవల దాడులు చేసి భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. 46 కేసులు నమోదు చేసి 52 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా డ్రగ్ కంట్రోల్ అధికారులు (DCA) నకిలీ మెడిసిన్ (Counterfeit Medicine) అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మార్కెట్లో ప్రతీది కల్తీ చేస్తున్న మాఫియా తాజాగా మందులను కూడా కల్తీ చేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Hyderabad | నకిలీ లెవిపిల్ 500 విక్రయం
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు మంగళవారం హైదరాబాద్ (Hyderabad)లోని అరవింద్ ఫార్మా (Arvind Pharma) డిస్ట్రిబ్యూటర్స్ భాగస్వామి-కమ్-కంపెటెంట్ పర్సన్ మనీష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. సన్ ఫార్మా (Sun Pharma) లాబొరేటరీస్ లిమిటెడ్ తయారు చేసినట్లు నకిలీ ‘లెవిపిల్ 500’ టాబ్లెట్లను ఆయన విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
జులై 4న హైదరాబాద్లోని గాంధీనగర్లోని డిస్టిబ్యూటర్ ఇంట్లో దాడి చేశారు. అక్కడ దొరికిన సమాచారం ఆధారంగా తాజాగా మనీష్ కుమార్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని సికింద్రాబాద్లోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా జులై 23 వరకు రిమాండ్ విధించారు. ఈ మందులు నకిలీవని నిర్ధారించిన డీసీఏ దర్యాప్తు చేస్తోంది. నకిలీ మందులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా లెవిపిల్ 500 మెడిసిన్ మూర్చ వ్యాధి తగ్గడానికి వినియోగిస్తారు.