అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP state president | కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Telangana BJP president Ramchandra Rao) ఆరోపించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress national president Mallikarjun Kharge) హైదరాబాద్ సభలో చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామాజిక పదాలు చేర్చమని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఏఐసీసీ అంటేనే ‘ఆల్ ఇండియా చీటింగ్ కాంగ్రెస్’గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఏఎన్ఐ వార్తాసంస్థతో శనివారం రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఖర్గే వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ” మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యవసర పరిస్థితి ఒక చీకటి రోజు. అసలు రాజ్యాంగంలో ‘లౌకిక’, ‘సోషలిస్ట్’ అనే పదాలు లేవు. ఎమర్జెన్సీ సమయంలో 42వ సవరణ తర్వాత వీటిని చేర్చారని” పేర్కొన్నారు.
BJP state president | ఎవరు చేర్చమన్నారు?
రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు చేర్చాలని ఎవరు అడిగారని రాంచందర్ రావు ప్రశ్నించారు. వాటిని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. “ఈ రెండు పదాలను జోడించమని వారిని (కాంగ్రెస్) ఎవరు అడిగారు? ఆ పదాలను జోడించిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, అటల్ బిహారీ వాజ్పేయి (Atal Bihari Vajpayee) అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ రెండు పదాలను మార్చడానికి మేము ఎప్పుడైనా ప్రయత్నించామా?” అని రాంచందర్ రావు ప్రశ్నించారు.
BJP state president | సవరణ ప్రయత్నాలు చేయలేదు..
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నాలు చేయలేదని రాంచందర్ రావు గుర్తు చేశారు. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావాలనే బీజేపీపై బురద జల్లుతోందని విమర్శించారు. “బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పి దేశాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.. ఎన్నికల్లో ఓడిపోతున్నందుకు వారు తీవ్ర నిరాశలో ఉన్నారు.. ఏఐసీసీ ఇప్పుడు ‘ఆల్ ఇండియా చీటింగ్ కాంగ్రెస్’గా మారింది. అందుకే వారికి బీజేపీని నిందించడం, అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప వేరే సమస్యలు లేవు” అని ఎద్దేవా చేశారు.
BJP state president | ప్రవేశికపై వివాదం
రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలపై ఇటీవల వివాదం చెలరేగింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే (RSS General Secretary Dattatreya Hosabale) రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్”, “లౌకిక” పదాలను చేర్చడంపై చట్టబద్ధతను ప్రశ్నించడంతో రాజకీయ వివాదం చెలరేగింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రవేశికలో “సోషలిజం”, “లౌకిక” అనే పదాలను బలవంతంగా చేర్చడాన్ని పునఃపరిశీలించాలని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. హోసబలేకు కానీ, బీజేపీకి కానీ రాజ్యాంగ ప్రవేశిక నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగించే ధైర్యం చేస్తారా? అని ప్రశ్నించారు. ” రాజ్యాంగం నుంచి లౌకిక, సోషలిస్ట్ పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ వ్యక్తి అన్నారని విన్నాను. నేను వారికి సవాలు చేస్తున్నాను. అది హోసబలే అయినా, బీజేపీ అయినా, ప్రధానమంత్రి మోదీ అయినా, లేదా అమిత్ షా అయినా.. ఎవరూ ఆ పదాలను తొలగించలేరు. వారికి ఇదే నా సవాల్. మీరు వానిని తొలగించడానికి ధైర్యం చేయగలరా? ” అని ఖర్గే ప్రశ్నించారు.