అక్షరటుడే, హైదరాబాద్: Integrated Schools : పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి ఇంటర్ విద్య పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (Integrated Command and Control Centre – ICCC) లో ముఖ్యమంత్రి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున, ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలు చేస్తున్నారని, అందువల్ల అక్కడ డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు వివరించారు.
Integrated Schools : సరైన మార్గదర్శకత్వం..
అలాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు విద్యా కమిషన్, ఎన్జీవోలు, పౌరుల సలహాలు, సూచనలను తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యను పటిష్ఠం చేయడానికి శాసనసభలోనూ చర్చకు పెడతామని, ఇంటర్లో విద్యార్థుల చేరికతో పాటు వారి హాజరుపైనా దృష్టి పెట్టాలన్నారు.
Integrated Schools : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Young India Integrated Residential School) నమూనాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రతి బడిలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలన్నారు.
Integrated Schools : ప్రతి నియోజకవర్గంలో..
ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామన్నారు. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయినందున, రెండో పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు, సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని ఆదేశించారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నతవిద్యా మండలి ఛైర్మన్, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.