అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిత్యం దాడులు, తనిఖీలు చేస్తూ లంచాలకు మరిగిన వారి పని పడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కేసుల వివరాలను ఏసీబీ తాజాగా వెల్లడించింది.
ACB Raids | మొత్తం 31 కేసులు
ఈ ఏడాది జూన్లో ఏసీబీ అధికారులు(ACB Officers) మొత్తం 31 కేసులు/విచారణలు నమోదు చేశారు. ఇందులో వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు అక్రమాస్తుల కేసులు, మూడు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు ఉన్నాయి. నాలుగు రెగ్యులర్ ఎంక్వైరీలు, ఏడుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ACB Raids | 25 మంది ఉద్యోగులపై కేసు
ఏసీబీ అధికారులు తమ దాడుల్లో భాగంగా పలువురు అధికారులను రెడ్ హ్యాండెడ్(Red Handed)గా పట్టుకున్నారు. అంతేగాకుండా అక్రమాస్తులు కలిగి ఉన్న వారిని సైతం అరెస్ట్ చేశారు. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు సహా ఇరవై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులను(Government Employees) అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. ట్రాప్ కేసుల్లో రూ.3,43,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు అక్రమాస్తుల కేసుల్లో రూ.13,50,000, రూ.5,22,75,000 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఆర్టీఏ చెక్పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ లెక్కల్లో చూపని రూ.2,72,030 మొత్తాన్ని సీజ్ చేశారు.
ACB Raids | ఆరు నెలల్లో 126 కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30 వరకు ఏసీబీ 126 కేసులను నమోదు చేసింది. ఇందులో 80 ట్రాప్ కేసులు, 8 అసమాన ఆస్తుల కేసులు, 14 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 10 రెగ్యులర్ ఎంక్వైరీలు, 11 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ఎనిమిది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రాప్ కేసుల్లో రూ.24,57,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2025 జూన్ 30 వరకు ఏసీబీ 129 కేసులను ఖరారు చేసి, ప్రభుత్వానికి తుది నివేదికలను పంపింది