అక్షరటుడే, వెబ్డెస్క్:Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లా(Narsingpur District)లో భయానక ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ యువతి గొంతు కోసి హత్య చేయబడ్డ ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మృతురాలు 19 ఏళ్ల సంధ్యా చౌదరి, 12వ తరగతి విద్యార్థినిగా గుర్తించారు. ఆమెను అభిషేక్ కోస్తి అనే యువకుడు అత్యంత క్రూరంగా చంపాడు. ఆస్పత్రిలో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులతో పాటు కొంత మంది పేషెంట్స్ కూడా ఉన్నా.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో జరిగిన ఈ ఘటన ఆస్పత్రి(Government Hospital)లో భద్రతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేసింది.
Madhya Pradesh | దారుణ హత్య..
ఈ హత్యకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోమవారం వైరల్ అయ్యింది. అందులో అభిషేక్, సంధ్యను కింద పడేసి, ఆమె ఛాతిపై కూర్చుని గొంతు కోస్తూ కనిపించాడు. సంధ్య రక్తపు మడుగులో తడిసి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన తర్వాత అభిషేక్ తనను తాను కత్తితో గాయపరచుకునే ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే అక్కడి నుంచి బైక్పై పారిపోయాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. నర్సింగ్పూర్కు చెందిన 19 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఈ నెల 27న ప్రసూతి వార్డు(Maternity ward)లో ఉన్న స్నేహితురాలి బంధువును చూసేందుకు వెళ్లింది.
ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అభిషేక్ అనే యువకుడు. ఆస్పత్రి వద్ద ఆమె కోసం ఎదురుచూస్తున్న ఆ వ్యక్తి వార్డు నంబర్ 22 బయట ఆమెతో కొద్దిసేపు మాట్లాడి అనంతరం ఆ యువతిపై దాడికి దిగాడు. ముందు యువతిని చెంపపై కొట్టి కిందపడేశాడు. తర్వాత ఆమె ఛాతీపై కూర్చుని, తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ ఘోరం జరుగుతున్నా కూడా ఎవరు నిలువరించే ప్రయత్నం చేయకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. పలువురు పేషెంట్లు భయంతో తక్షణమే ఆస్పత్రిని వదిలి వెళ్లిపోయారు.