అక్షరటుడే, వెబ్డెస్క్ : Bike Taxi | ఓలా(ola), ఉబర్ (uber), ర్యాపిడో (rapido) వంటి బైక్ ట్యాక్సీ సేవలపై ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో సాయ పడుతున్నారు. అయితే కర్ణాటక (Karnataka)లో బైక్ ట్యాక్సీ సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీ (Bike Taxi)లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చట్టం చేయలేదు. దీంతో మోటారు వాహనాల చట్టం కింద నిబంధనలు రూపొందించే వరకు ఈ సర్వీసులను నిలిపివేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆయా కంపెనీలు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీంతో జూన్ 16 నుంచి కర్ణాటకలో బైక్ ట్యాక్సీల సేవలు నిలిచిపోనున్నాయి. హైకోర్టు (High Court) జూన్ 20లోగా ప్రభుత్వం తన స్పందన తెలుపాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
రాపిడో, ఉబర్ వంటి బైక్ టాక్సీ అగ్రిగేటర్లు మోటారు వాహనాల చట్టం కింద రాష్ట్ర రూపొందించిన నియమాలు లేకుండా పనిచేయలేవని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓలా, ఉబర్ ఇండియా అప్పీళ్లు దాఖలు చేశాయి. కంపెనీల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప వాదిస్తూ ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా ఉపయోగించవచ్చని కోర్టు అంగీకరించిందని వాదించారు. అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి అవి అధికారిక విధానం ప్రకారం మాత్రమే పనిచేయాలని వాదించారు. రాష్ట్ర నియమాలు లేనప్పుడు బైక్ టాక్సీలు నడపవచ్చని ఉబర్ న్యాయవాది కేంద్ర నియమాలను ఉదహరించారు. కానీ AG శెట్టి అంగీకరించలేదు.
Bike Taxi | ఆరు లక్షల మంది ఉపాధిపై ప్రభావం
కర్ణాటకలో దాదాపు ఆరు లక్షల మంది వరకు బైక్ ట్యాక్సీల ద్వారా ఉపాధి (Employment) పొందుతున్నట్లు సమాచారం. రైడర్లలో 75 శాతం మంది ఈ ప్లాట్ఫామ్పై తమ ప్రాథమిక ఆదాయ వనరుగా ఆధారపడుతున్నారని, నెలకు సగటున రూ. 35,000 సంపాదిస్తున్నారని ర్యాపిడో కోర్టుకు తెలిపింది. బెంగళూరులోనే తన రైడర్లకు రూ.700 కోట్లకు పైగా, జీఎస్టీ రూ.100 కోట్లకు పైగా చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సర్వీసులు రద్దు అయితే వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. బైక్ టాక్సీ ఆపరేటర్లు జూన్ 15 నాటికి సేవలను నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేస్తామని కర్ణాటక రవాణా శాఖ అధికారులు తెలిపారు.