అక్షరటుడే, వెబ్డెస్క్: Bengaluru Stampede | కర్ణాటకలో రాజకీయం (Karnataka Politics) చాలా రంజు మీదుంది. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును సత్కరించేందుకు బెంగళూరులో నిర్వహించిన సభ విషాదంగా మారడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడడం. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఐపీఎల్ విజయోత్సవం (IPL victory) నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటనపై కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress government) బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
Bengaluru Stampede | రాజుకుంటున్న వేడి..
నిర్వాహక లోపాలే ఈ ప్రాణనష్టానికి కారణమని బీజేపీ నేతలు (BJP leaders) ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన ఆర్సీబీ ఆటగాళ్లను(RCB players) సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు తెలిపాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసిందని స్పష్టం చేశాయి. కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) నుంచి గవర్నర్కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు రాజ్భవన్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. అయితే, సన్మాన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది కాదని ఇటీవలే సిద్ధరామయ్య ప్రకటించడం గమనార్హం. ఇది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association) ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం తెలిపారు.
కేఎస్సీఏ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఆర్సీబీ ఈవెంట్కు వెళ్లానన్నారు. కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా క్రికెట్ సంఘం గవర్నర్ను ఆహ్వానించినట్లు కూడా సిద్ధరామయ్య ఇటీవలే ప్రకటించారు. అయితే, ఇప్పుడు రాజ్భవన్ ప్రకటన (Raj Bhavan statement) సీఎం వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) సమీపంలోని కర్ణాటక విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు నేతలు పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) తీవ్రంగా స్పందించారు. ‘గౌరవనీయులైన సిద్ధరామయ్య గారూ.. మీరు కర్ణాటక ముఖ్యమంత్రా లేక విధాన సౌధ మెట్ల ముఖ్యమంత్రా!? దయచేసి చెప్పండి?’ అని ప్రశ్నించారు. ‘కేవలం పోలీసులపై నెపం నెట్టి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే కుట్ర ఎందుకు?’ అంటూ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.