అక్షరటుడే, ఇందూరు: Mlc Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి (Dasarathi Krishnamacharya’s centenary) వేడుకలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయాన్ని (Khilla Ramalayam), అప్పటి జైలును శుక్రవారం ఆమె సందర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు.. నిజాం ఆకృత్యాలను ఎండగడుతూ ప్రజలను జాగృతం చేసిన దాశరథి జయంతి వేడుకలను నిర్వహించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల్లో దాశరథి ముందు వరుసలో ఉంటారన్నారు. నిజామాబాద్ ఖిల్లా జైలులో దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని రాసి తెలంగాణ ప్రజలను చైతన్యపర్చారని ఆమె గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా (Tourist center) తీర్చిదిద్దాలని ఉద్దేశంతో తమ ప్రభుత్వ సమయంలో నిధులు విడుదల చేశామన్నారు. అలాగే తాను ఎంపీగా ఉన్న సమయంలో రూ.2 కోట్లు విడుదల చేశానని, దురదృష్టవశాత్తు తమ ప్రభుత్వం వెళ్లిపోగానే కాంగ్రెస్ వాటిని నిలిపేసిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం జులై మొదటివారంలోపు శతజయంతి వేడుకలపై ప్రకటన చేయకపోతే, తామే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 20, 21న ఘనంగా నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. తెలంగాణలోని ప్రముఖ కవులను ఆహ్వానించి వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అనేక జిల్లాల్లో వడ్ల కొనుగోలు చేయలేదన్నారు. రేషన్ షాపుల్లో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మేయర్ నీతూ కిరణ్, జాగృతి నాయకులు ఘనపురం దేవేందర్, చరిత్రకారులు కందకుర్తి ఆనంద్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.