అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత(leopard) కలకలం సృష్టించింది. మెట్ల మార్గంలో 500 మెట్టు దగ్గర చెట్లపొదల్లో చిరుత కనిపించడంతో భక్తులు (Devotees) భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసి సెక్యూరిటీకి సమాచారం అందించారు. వారు సైరన్ మోతతో చిరుతను అడవిలోకి తరిమారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులను గ్రూపులుగా మెట్ల మార్గంలో అనుమతిస్తున్నారు.
ఇటీవల అలిపిరి నుంచి మెట్ల మార్గంలో చిరుతలు, వన్య ప్రాణులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీటీడీ(TTD) అధికారులు సైతం మానవ– వన్యప్రాణుల ఘర్షణ తగ్గించడానికి సమీక్ష నిర్వహించారు.
వన్యప్రాణుల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత కోసం అలిపిరి మెట్ల మార్గంలో అదనపు సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడకమార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
అలిపిరి మార్గాన్ని “చిరుత రహిత ప్రాంతంగా” మార్చేందుకు కెమెరా ట్రాపులు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చులు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.