అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoist leader | మావోయిస్టు పార్టీ సారథి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. విప్లవ పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారన్న ఉత్కంఠకు ఇంకా తెర పడలేదు.
ఈ నెల 21న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (General Secretary Nambala Kesava Rao) అలియాస్ బసవరాజు మృతితో పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ సారథ్య (party leadership) బాధ్యతలు ఎవరు చేపడతారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
మావోలను ఏరివేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించిన భద్రతా బలగాలు.. కొత్త సారథి నియామకంపై లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ప్రధాన కార్యద్శి ముప్పాల లక్ష్మణరావు (former general secretary Muppala Lakshmana Rao) అలియాస్ గణపతి పేరు బయటకు వచ్చింది. నంబాల గురువు అయిన గణపతి వయస్సు రీత్యా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు విప్లవ పార్టీని ముందుండి నడిపిన ఆయన.. 2018లో నంబాలకు బాధ్యతలు అప్పగించారు.
Maoist leader | పార్టీని నడపడం సాధ్యమేనా?
పదవి నుంచి తప్పుకున్న గణపతి అప్పటి నుంచి మావోయిస్టు పార్టీకి (Maoist party) సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన దేశాన్ని వీడి వెళ్లారు. అప్పటి నుంచి ఫిలిప్పీన్స్లో (Philippines) చికిత్స పొందుతున్న ఆయన.. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేశానికి తిరిగి వచ్చినట్లు బస్తర్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీన్ని భద్రతా వర్గాలు కొట్టి పడేస్తున్నాయి.
ప్రస్తుతం 70 ఏండ్ల వయస్సులో ఉన్న గణపతి (Ganapathy) మావోయిస్టు పార్టీని నడపడం అంత తేలిక కాదని పేర్కొంటున్నాయి. ‘అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి చికిత్స, విశ్రాంతి కోసం ఇన్నేళ్లు ఫిలిప్పీన్స్లో ఉన్నారు. ఎన్కౌంటర్లో (encounter) బసవరాజు మరణించిన తర్వాత ఆయన దేశానికి తిరిగివచ్చారు. 70వ పడిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మావోయిస్టులకు అధిపతిగా తిరిగి బాధ్యతలు చేపట్టలేరు’ అని భద్రతా వర్గాలు వెల్లడించాయి.
Maoist leader | తెలంగాణ వారికి అవకాశం
నంబాల ఎన్కౌంటర్ (Nambala encounter) తర్వాత ప్రధాన కార్యదర్శి ఎవరన్న దానిపై మావోయిస్టు పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఎన్కౌంటర్పై (encounter) స్పందించిన పార్టీ.. నంబాలను సజీవంగా పట్టుకుని చంపేశారని ప్రకటించినప్పటికీ, తదుపరి నాయకత్వంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, పార్టీకి నాయకత్వం వహించే అవకాశం తెలంగాణకు చెందిన వారికే దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
బస్తర్ డివిజన్లోని అడవుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి (Maoist party general secretary) బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన సీనియర్ కమాండర్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్, తెలంగాణకు (Telangana) చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నంబాల వారసుడి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని భద్రతా బలగాలు చెబుతున్నాయి. బసవరాజు స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టినా.. ఆ వ్యక్తికి భూమ్మీద నూకలు కొద్దికాలమే ఉంటాయని, ఎన్కౌంటర్లో ఆ వ్యక్తిని భద్రతా దళాలు అంతం చేస్తాయని నక్సల్ వ్యతిరేక ఆపరేషన్కు చెందిన అధికారి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు.