అక్షరటుడే, వెబ్డెస్క్ :Operation Sindoor | ఆపరేషన్ సిందూర్.. ఈ పేరు గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ మారుమోగిపోతుంది.
మే 7వ తేదీ తెల్లవారుజామున, భారత రక్షణ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారీ స్థాయిలో దాడులు నిర్వహించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి(Terror Attack)లో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ దాడికి భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందన ఇది. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట పాకిస్థాన్పై భారత సైన్యం దాడులు నిర్వహించడమే కాకుండా, న్యాయం కోసం రగిలే ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఒక ప్రత్యేక చిహ్నాన్ని (లోగో) కూడా ఆవిష్కరించింది.
Operation Sindoor | లోగో వెనక ఉంది వీరే..
‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం(Indian Army) లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
వీటిలో బహవల్పూర్, ముజఫరాబాద్, కోట్లి, సియాల్కోట్లోని శిబిరాలు కూడా ఉన్నాయి. హతమైన వారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.అయితే పహల్గామ్ Pahalgam మారణకాండ అనంతరం నెలకొన్న ఉద్వేగభరిత వాతావరణాన్ని, ముఖ్యంగా భర్తలను కోల్పోయిన మహిళల ఆవేదనను ప్రతిబింబించేలా ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ ఆపరేషన్ కోసం భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా (Lt. Col. Harsh Gupta), హవల్దార్ సురీందర్ సింగ్ (Havildar Surinder Singh) ఒక ప్రత్యేక లోగో(Logo)ను రూపొందించారు. ఈ లోగో డిజైన్లో ఆపరేషన్ పేరును పెద్ద అక్షరాలతో ముద్రించి, పేరులోని ఒక ‘O’ అక్షరాన్ని ఎర్రటి సిందూరం ఉన్న గిన్నె ఆకారంలో తీర్చిదిద్దారు. ఆ గిన్నె నుంచి ఒలికినట్లుగా ఉన్న సిందూరం, పహల్గామ్ దాడిలో అమరులైన వారి భార్యల వేదనకు ప్రతీక.
ఈ డిజైన్ని మోదీ(Prime Minister Modi) ముందుకు తీసుకెళ్లగా ఆయన ఆమోదించారు. గతంలో పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యలకు ఎక్కువగా సంప్రదాయ సైనిక పేర్లనే పెట్టేవారు. అవి అంతర్గతంగా ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, బాహ్యంగా బలాన్ని ప్రదర్శించేలా ఉండేవి. కొన్నిసార్లు ఆపరేషన్ల గోప్యత కోసం, మరికొన్ని సార్లు భారతీయ పురాణాల నుంచి కూడా పేర్లను ఎంచుకునేవారు. అయితే ఆపరేషన్ సిందూర్ Operation Sindoor సాధారణమైన లోగో కాదు, భారత మహిళల భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఉంది.