అక్షరటుడే, వెబ్డెస్క్ : Diwali Crackers | దీపావళి సందర్భంగా చిన్నా పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పటాకులు కాల్చారు. అయితే టపాసులు కాలుస్తూ పలువురు గాయపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం దీపావళి వేడుకలను (Diwali Celebrations) ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు ఉత్సాహంగా బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు టపాసులు పేలి పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా కంటికి గాయాలతో 70 మంది బాధితులు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మెహదీపట్నం సరోజినిదేవి కంటి ఆస్పత్రికి వచ్చారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉన్నారు.
Diwali Crackers | 12 మందికి తీవ్ర గాయాలు
దీపావళి (Diwali) పండుగ ఉత్సాహంలో ఆనందం అలుముకున్నా.. కొందరు బాణసంచా కాలుస్తూ గాయపడ్డారు. బాధితులు పెద్ద సంఖ్యలో సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం 70 మంది బాణసంచా బాధితులు ఆసుపత్రికి చేరగా, వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. 12 మంది తీవ్రంగా గాయపడగా, అందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు యువకులు, ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 43 మందికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపించారు.
Diwali Crackers | పెరిగిన బాధితుల సంఖ్య
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా అధికారులు ఎన్నో జాగ్రత్తలు సూచించినప్పటికీ, టపాసుల వల్ల గాయపడే వారి సంఖ్య తగ్గడం లేదు. గత సంవత్సరం సరోజినీ ఆసుపత్రిలో (Sarojini Devi Eye Hospital) 48 మంది బాధితులు చికిత్స పొందగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. ఒక్కరోజులోనే వరుస అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ బహుదూర్పురా చౌరస్తాలోని ఓ స్క్రాప్ గోడౌన్లో బాణసంచా పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఫైర్సిబ్బంది సమయానికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే విధంగా మంగళహాట్ ప్రాంతంలోని ఓ గ్యారేజ్లో టపాసులు పేలడంతో వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది నియంత్రించారు.
టపాసులు (Crackers) కాల్చేటప్పుడు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, పిల్లలను పెద్దల పర్యవేక్షణలో ఉంచాలని అధికారులు సూచించారు. దీపావళి ఆనందం విషాదంగా మారకుండా జాగ్రత్తగా జరుపుకుందామని వైద్యులు, పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇలాంటి సంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.