అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో దీపావళి సందర్భంగా పేకాడిన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 19 నుంచి 22 వరకు పేకాట ఆడిన వారిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 138 కేసులు నమోదు చేయడంతో పాటు మొత్తం రూ.14,15,917 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
నిజామాబాద్ డివిజన్లో మొత్తం కేసులు 42 నమోదు కాగా పేకాటాడుతూ పట్టుబడిన 180 మంది దగ్గర 5,13,402 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్మూర్ డివిజన్లో 44 కేసులు నమోదు చేశారు. మొత్తం 232 మందిని అదుపులోకి తీసుకుని రూ.5,51,785 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బోధన్ డివిజన్లో (Bodhan division) 52 కేసులు నమోదు చేసి 187 మంది అదుపులోకి తీసుకున్నారు. అలాగే రూ.3,50,730 నగదును స్వాధీన పర్చుకున్నారు. మూడు డివిజన్లలో మొత్తంంగా 138 కేసులు నమోదయ్యాయి. మూడు డివిజన్లలో పేకాట ఆడుతూ మొత్తం 599 మంది పట్టుబడ్డారని.. రూ.14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్పష్టం చేశారు.
