HomeUncategorizedToll Pass | నాలుగు రోజుల్లో 5 లక్షల టోల్​పాస్​లు జారీ

Toll Pass | నాలుగు రోజుల్లో 5 లక్షల టోల్​పాస్​లు జారీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Pass | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక టోల్​పాస్లను (Toll Pass)​ అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఎన్​హెచ్​ఏఐ (NHAI) టోల్​పాస్​లను జారీ చేస్తుంది. నాన్​ కమర్షియల్​ వాహనాలకు రూ.3 వేలు చెల్లించి పాస్​ తీసుకుంటే.. ఏడాది పాటు 200 సార్లు టోల్​ గేట్ల మీదుగా ఫ్రీగా వెళ్లొచ్చు.

టోల్​పాస్​లు అమలులోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో విక్రయాలు జరగడం గమనార్హం. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఎన్​హెచ్​ఏఐ ఏకంగా 5 లక్షల పాస్​లను జారీ చేసింది. దీంతో రూ. 150 కోట్ల ఆదాయం వచ్చింది. టోల్​పాస్​ల కొనుగోలులో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా.. కర్ణాటక, హర్యానా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ల ద్వారా అత్యధిక లావాదేవీలను నమోదు చేశాయని NHAI తెలిపింది.

Toll Pass | రూ.3 వేలతో..

ప్రైవేట్ వాహనాలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల్లో ప్రయాణించడానికి కేంద్రం వార్షిక టోల్​పాస్​లు తీసుకొచ్చింది. ఇప్పుడున్న ఫాస్టాగ్​ (FASTag) ద్వారానే టోల్​పాస్​ను యాక్టివేట్​ చేసుకోవచ్చు. రూ.3వేలు చెల్లించి ఈ పాస్​ పొందితే 200 ట్రిప్​లు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. దీంతో ఒక్కసారి టోల్​గేట్​ దాటడానికి సగటున రూ.15 ఛార్జీ అవుతోంది. ఎక్కువగా జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కార్లు, జీపులు వ్యాన్‌లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.

Toll Pass | ఇలా పొందొచ్చు

రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్, NHAI వెబ్‌సైట్‌లు, FASTag జారీచేసే పోర్టల్‌ల ద్వారా టోల్​ పాస్​లు పొందొచ్చు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్​నే టోల్​పాస్​గా యాక్టివేట్​ చేసుకోవచ్చు. దీనికోసం వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకొని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం రెండు గంటల్లోపు పాస్​ యాక్టివేట్​ అవుతుంది. దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని దాదాపు 1,150 టోల్ ప్లాజాలలో పాస్​ ద్వారా ప్రయాణం చేయొచ్చు. అయితే రాష్ట్ర రాహదారులపై మాత్రం ఇది వర్తించదు.