అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో వర్షం నీటిని ఒడిసి పట్టడానికి అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో భారీ వర్షం కురిసిన అంత వృథా అవుతోంది. చెరువులు లేకపోవడంతో భూమిలోకి నీరు ఇంకడం లేదు. దీంతో భూగర్భ జలాలు పెరగక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై(Hyderabad Metro Water Supply), సీవరేజ్ బోర్డు అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
Hyderabad | భారీ వర్షం పడ్డా..
నగరంలో భారీ వర్షం(Heavy Rains) పడితే కాలనీలు నీట మునుగుతున్నాయి కానీ.. భూగర్భ జలాలు వృద్ధి చెందడం లేదు. ఇటీవల సర్వే చేసిన అధికారులు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 16 వేల ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించాలని గుర్తించారు. ఈ మేరకు ఆయా ఇళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా 90 రోజుల్లో 16 వేల ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించడానికి కార్యాచరణ ప్రారంభించారు.
ఓఆర్ఆర్(ORR) లోపల 300 చదరపు అడుగుల కంటే ఎక్కవ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుంటే ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించాలి. కానీ చాలా మంది దీనిని పాటించడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు పెరగక బోరు బావులు వట్టిపోతున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భూగర్భ జలాలు పెంచడంతో పాటు, ట్యాంకర్ల (Water Tankers)పై ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడం కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నారు.
అధికారులు, ఎన్జీవోలు వారంలోపు తగిన ప్రదేశాలను గుర్తించి ఇంకుడు గుంతల నిర్మాణం పనులు చేపడతారు. ఇళ్ల యజమానులకు అవగాహన కల్పిస్తారు. అలాగే నిరుపయోగంగా ఉన్న బోర్వెల్లను ఇంజెక్షన్ బావులుగా మార్చాలని కూడా బోర్డు యోచిస్తోంది. మొబైల్ యాప్ (Mobile App), డాష్బోర్డ్ (Dashboard) ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని నిత్యం పర్యవేక్షించనున్నారు.