అక్షరటుడే, వెబ్డెస్క్ : Saudi Accident | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఫరహత్ మక్కాలో ఉమ్రా యాత్రను పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తున్న బస్సు ఆదివారం అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు (Indians) చనిపోయారు.
సౌదీ బస్సు ప్రమాదం (Saudi Bus Accident) ఘటనలో హైదరాబాద్కు చెందిన 16 మంది యాత్రికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్కు సంబంధించిన 16 మంది యాత్రికులు ఆ బస్సులో ఉన్నారు. ప్రమాదంలో 42 మంది సజీవ దహనం అయ్యారు. దీంతో మృతదేహాలు గుర్తు పట్టలేకుండా మారిపోయాయి. కాగా.. ఈ ప్రమాదంలో బస్సులోని ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్లు సమాచారం.
మృతుల్లో హైదరాబాద్కు (Hyderabad) చెందిన రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తించారు. సౌదీ అరేబియాలో బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని వస్తున్న ప్రాథమిక సమాచారంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు.
Saudi Accident | కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఈ దుర్ఘటనపై విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో (Saudi Embassy Officers) మాట్లాడాలని, తక్షణం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వెంటనే ఢిల్లీలో ఉన్న కో-ఆర్డినేషన్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్తో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 79979 59754.
